హనుమాన్ చౌల్ట్రీ దుకాణ దారులకు షాక్
– సముదాయాన్ని సీజ్ చేసిన దేవాదాయ శాఖ అధికారులు
– పై అధికారులకు నివేధిక అందిస్తాం: జిల్లా ఇనుస్పెక్టర్ వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం దేవాదాయ శాఖ స్టేషన్ హనుమాన్ దేవాలయ పరిధిలోని హనుమాన్ చౌల్ట్రీ సముదాయ వ్యాపారులకు ఆ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. గురువారం దేవాదాయ శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు జిల్లా ఇనుస్పెక్టర్ మధుబాబు ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని దె వాదాయ శాఖ లోని 15 మంది ఈఓల బృందంతో కలిసి హనుమాన్ చౌల్ట్రీని సందర్శించారు. అధికారులతో పాటు స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవరావుతో కలిసి దుకాణాలను తనిఖీ చేశారు.

బకాయిలు పడిన కిరాయి దారుల దుకాణాలను సీజ్ చేసి కొరడా జులిపించారు. తనిఖీలకు ముందే దుకాణాలు మూతపడి ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాదాపు 12 దుకాణాలు, పైభాగంలోని 7 గదులతో మొత్తం సముదాయాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇనుస్పెక్టర్ మధుబాబు మాట్లాడుతూ సముదాయం నుంచి దాదాపు 1,2 ఏండ్ల నుంచి సుమారు రూ. 2.34 లక్షలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. గత యేడాది దుకాణదారులకు నోటీసులు కూడ అందించామని గుర్తుచేశారు. గతంలో నిర్వహణ చేసిన వారు సముదాయానికి బకాయిలు చెల్లించి దేవాదాయ శాఖకు అప్పగించగినట్లు వివరించారు. ఈ తనిఖీ నివేధికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓలు శేఖర్ గౌడ్, తాడెం నరేందర్ తదితరులు ఉన్నారు.


