జాతరకు ముస్తాబైన శ్రీరామలింగేశ్వర ఆలయం
– జినుగుర్తిలో భక్తులకు ఏర్పాట్లు : చైర్మన్ ప్రవీణ్ గౌడ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం జినుగుర్తిలో వెలసిన శ్రీరామలింగేశ్వర దేవాలయం శ్రావణమాస సోమవారం పూజలకు ముస్తాబవుతోంది. శ్రావణమాసం ఆఖరి సోమవారం సందర్భంగా దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆఖరి సోమవారం ఆలయంలో వెలసిన రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. భక్తులను దృష్టిలో ఉంచుకుని జాతరకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఆలయ చైర్మన్ ప్రవీణ్ గౌడ్ దృష్టిసారించారు. ప్రతి యేడాది శ్రావణమాసంలో ఆఖరి సోమవారం రోజున రామలింగేశ్వర ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు కూడ నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో రామలింగేశ్వరుని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు.


