గుంతలో పడి యువకుడి మృతి
– తాండూరు పట్టణంలో వెలుగులోకి
– మృతుడు కర్ణాటక వాసి
తాండూరు, దర్శిని ప్రతినిధి: సైడ్ డ్రైవ్ పక్కన ఉన్న గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం చించొల్లి సమీపంలోని బైరంపల్లి తాండాకు చెందిన కృష్ణ పవార్(25) అనే యువకుడు శనివారం రాత్రి తాండూరు పట్టణంలోని అరవింద్ పెట్రోల్ సమీపంలో రోడ్డు విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న సైడ్ డ్రైన్ గుంతలో పడిపోయాడు. ఆదివారం తెల్లవారు జామున గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే మృతుడు మద్యం మత్తులో ఉండి గుంతలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

