106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్‌

తెలంగాణ రాజకీయం హైదరాబాద్

106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్‌
– బీఆర్ఎస్ సభకు హాజరైనందుకు చర్యలు
– ఆ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి, సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి  7వ తేదిన ఏర్పాటు చేసిన సభకు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 7వ తేదీ సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ సిబ్బందితో వెంకట్రామిరెడ్డి సభ ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్న బీజేపీ నాయకులు, వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సీఈవో వికాస్ రాజ్‌కు ఆధారాలలో సహా ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై విచారణ జరపాలని సిద్దిపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరిని సీఈవో ఆదేశించారు. ఈ సంఘటనపై విచారణ చేసిన కలెక్టర్ 106 మంది ప్రభుత్వ సిబ్బంది ఈ సభలో పాల్గొన్నారని గుర్తించారు. సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్‌ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఆ 106 మందిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి…

ఆరోగ్యానికి పిస్తా..!