పోట్లీ మహరాజ్‌ దేవస్థానంలో అవినీతి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పోట్లీ మహరాజ్‌ దేవస్థానంలో అవినీతి..!
– షాపులు కేటాయింపుల వివరాలు బహిర్గతం చేయాలి
– బీఆర్ఎస్ యువ నాయకులు సంతోష్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పోట్లీ మహరాజ్‌ దేవస్థానం అభివృద్ధి, షాపుల కేటాయింపుల వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగాయని బీఆర్‌ఎస్‌ నాయకులు సంతోష్‌ గౌడ్ ఆరోపించారు.

ఈ ఆరోపణలకు సంబంధించి తమ వద్ద పలు పత్రాలు, ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. దేవస్థానం చైర్మన్‌గా ప్రసాద్‌ గౌడ్‌ ఉన్న సమయంలో షాపుల కేటాయింపుల పేరుతో ఎంత మొత్తంలో అడ్వాన్స్‌లు వసూలు చేశారు? ఎవరెవరికి షాపులు కేటాయించారు? ఏ నిబంధనల ప్రకారం కేటాయింపులు చేపట్టారు? వసూలు చేసిన మొత్తంలో ఎంత దేవస్థానం ఖాతాలో జమ చేశారు? ఎంత మొత్తానికి రసీదులు ఇచ్చారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

దేవస్థానం అభివృద్ధి పేరుతో వచ్చిన నిధులు, చేసిన ఖర్చులకు సంబంధించిన పూర్తి లెక్కలను ప్రజల ముందుంచాలని కోరారు. షాపుల కేటాయింపు జాబితా, అడ్వాన్స్‌ వివరాలు, రసీదులు, బ్యాంకు ఖాతా లావాదేవీలు, అభివృద్ధి పనుల బిల్లులు, టెండర్లు, అనుమతులను బహిర్గతం చేయాలని అన్నారు.

ఈ వ్యవహారంపై దేవస్థానం వద్దే బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రసాద్‌ గౌడ్‌తో పాటు ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన వారు కూడా చర్చకు రావాలని సవాల్‌ చేశారు. అభివృద్ధి పేరుతో ప్రకటనలు చేయడం కాకుండా ప్రతి రూపాయికి లెక్క చూపించాలని డిమాండ్‌ చేశారు. అయితే ఇవన్నీ ఆరోపణలేనని, సంబంధిత వర్గాల వివరణ, అధికారిక రికార్డుల పరిశీలనతోనే వాస్తవాలు తేలాల్సి ఉంటుందని స్పష్టం చేయాలని అన్నారు.

వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు