ఘనంగా తొలిపూజలు
– పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఏకాదశిని జరుపుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో తొలి ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని పాండురంగస్వామి దేవాలయంలో రుక్మిణీ, విఠల్ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గీతా సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం నిర్వహించారు.
అదేవిధంగా పాత తాండూరులోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వార్లకు అభిషేకం, పూజలు నిర్వహించారు. దీంతో పాటు తాండూరు మండలంలోని అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటే శ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. మరోవైపు తాండూరు పట్టణంలోని పాండురంగా దేవాలయంలో నిర్వహించిన తొలి ఏకాదశి పూజలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో వెలసిన స్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.



