నదుల వద్ద బందోబస్తు
– పాడైన రోడ్లకు వెంటనే మరమ్మత్తులు
– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– బాచారం కల్వర్టును పరిశీలించిన మంత్రి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వర్షాలను దృష్టిలో ఉంచుకుని వాగులు, నదుల వద్ద బందోబస్తు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం బాచారం వాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్ పి కోటిరెడ్డిలతో కలిసి పరిశీలించారు. జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై క్షేత్ర స్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారుల ఆదేశించారు. అదేవిధంగా నదుల వద్ద పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. మరోవైపు ప్రజలు ప్రవాహ వేగాలు గమనించకుండా వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.



