దేవీ.. నమోస్తుతే..!
– నగేశ్వరాలయంలో నవరాత్రి శోభ
– అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఉత్సవాలు
– ఆకట్టుకుంటున్న భక్తుల ఆట పాటలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేవీ.. నమోస్తుతే.. అంటూ తాండూరు భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్దలతో కొలుస్తున్నారు. తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో వెలసిన కన్యాకా పరమేశ్వర మాతకు ప్రతిరోజూ అలంకరణలు చేస్తూ పూజిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం, నగరేశ్వర దేవాలయ పాలక మండలి, ఆర్యవైశ్య యువజన సంఘం, మహిళ సంఘం, వాసవిక్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, నగరేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.

శుక్రవారం అమ్మవారికి లలితా త్రిపుర సుందరిగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి ఆయా సంఘాల మహిళలు, భక్తులు బతుకమ్మ, దాండియా ఆటలతో ఉత్సహాంగా సంబరాలు జరుపుకున్నారు. మహిళల లయబద్దమైన ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కుంచెం మురళిధర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి కోట మురళి, కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, వాసవి మహిళ సంఘం అధ్యక్షులు కల్వ సరిత, కార్యదర్శి గుబ్బ ప్రగతి, కోశాధికారి కోస్గి సరిత, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, నగరేశ్వర భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


