దైవ యాత్రలో దారుణం
– ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ
– అక్కడికక్కడే ఇద్దరు మృతి
– మృతులు వికారాబాద్ జిల్లా వాసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దైవ దర్శన యాత్రలో జరగరాని దారుణం జరిగిపోయింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మృతులు, బాధితులు వికారాబాద్ జిల్లా యాలాల మండలంకు చెందిన వారు గమనార్హం. వివరాల్లోకి వెళితే యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి భీమయ్య కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం శ్రీశైలం దైవదర్శనానికి ఆటోలో బయల్దేరారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల పరిధిలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని తెలకపల్లి ప్రబుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. దైవ దర్శనం కోసం చేసిన ఈ యాత్ర వారి కుటుంబంలో విషాదం నింపింది. ఈ సంఘటనతో జుంటుపల్లిలో విషాధ చాయలు అలుకున్నాయి. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

