నేరం జరిగితే గంట నరకం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

నేరం జరిగితే గంట నరకం..!
– కూతవేటు ఠాణా ఉన్న పరిధిలో లేక అవస్థలు
– రాజీవ్ కాలనీని తాండూరు టౌన్ పోలీస్టేషన్లో కలపాలి
– జిల్లా ఎస్పీకి కౌన్సిలర్ జావిద్ వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రాజీవ్ ఇందిరమ్మ కాలనీని యాలాల పోలీస్ స్టేషన్ పరిధి నుంచి తొలగించి, సమీపంలోని తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చాలని 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ పరిధిలో ఉన్నప్పటికీ రాజీవ్ ఇందిరమ్మ కాలనీ యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యాలాల పోలీస్ స్టేషన్ కాలనీకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అత్యవసర పరిస్థితులు, నేరాలు లేదా దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే విలువైన సమయం వృథా అవుతోందని అన్నారు.

కాలనీవాసుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమీపంలోని తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి కాలనీని మార్చితే పోలీసు సేవలు త్వరగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఇందుకు జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించి.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు జావిద్ వెల్లడించారు.

ఘనంగా పివిఆర్ జన్మదిన వేడుకలు..!