చీటీ డబ్బులిస్తారా లేదా..
– చిట్ఫండ్ కార్యాలయం వద్ద బాధితుల నిలదీత
– వికారాబాద్ జిల్లా కేంద్రంలో సంఘటన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : నెలనెలా కట్టిన చీటీ డబ్బులు ఇస్తారా లేదా అంటూ బాధితులు చిట్ఫండ్స్ నిర్వహకులను నిలదీశారు. గడువు తీరినా డబ్బులు ఇవ్వడంలేదని తాళం వేసేందుకు సిద్దమయ్యారు. ఈ సంఘటన మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఎస్ఎల్ఎన్కే చిట్ ఫండ్స్ సంస్థలో స్థానికులు చీటీలు వేసి నెలనెల డబ్బులు కట్టారు. చీటీల గడువు ముగిసినా డబ్బులు చెల్లించడం లేదని మంగళవారం బాధితులు చిట్ ఫండ్స్ వద్దకు చేరుకున్నారు. చిట్ ఫండ్ కార్యాలయం తెరిచే ఉన్నా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో బాధితులు చిట్ ఫండ్ బ్రాంచ్ మేనేజర్కి ఫోన్ చేశారు. గడువు తీరిన వారందరికి వెంటనే డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇప్పటికే చాలా నెలలుగా తమ డబ్బుల కోసం వేచి చూస్తున్నామని నిలదీశారు. సహనం నశించి చిట్ ఫండ్స్కు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ విషయమై మేనేజర్ను బాధితులు, పలువురు మీడియా ప్రతినిధులు వివరణ కోరగా చీటీల డబ్బులు వసూలు కాలేవని, అయ్యాక ఇస్తామని చీటీలు కట్టిన వారందరికి చెల్లిస్తామని బదులిచ్చారు.

