సబ్బులు, షాంపూలు ప్రియం..!
– ధరలు పెంచే యోచనలో కేంద్రం
– కారణం ఎంతో తెలుసుకోవాల్సిందే
దర్శిని డెస్క్: దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యులను బెంబెలెత్తిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతుంటే కొన్ని వస్తువులపై ధరాలను పెంచే ఆలోచనలో ఉంది కేంద్రం. అందరూ వినియోగించే సబ్బులు, షాంపూల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే.. సబ్బులు, షాంపూల తయారీలో వినియోగించే కీలక ముడి పదార్థమైన ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచడమే ప్రధానం. మన దేశానికి శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్స్ ఇండోనేషియా, మలేషియా, థాయిల్యాండ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి అవుతోంది. దీంతో అధిక యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీ విధించాలని రెండు నెలల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ కేంద్రానికి సూచించింది.
అలా చేస్తే దిగుమతి చేసుకునే శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్స్ ధరలు మరింత పెరుగుతాయి. ఫలితంగా ఈ ముడి పదార్థం ఆధారంగా తయారు చేసే కాస్మటిక్స్ ధరలు కూడా తధానుగుణంగా పెంచాల్సి వస్తుంది.డ్యూటీ పెంపు ప్రతిపాదనను ఇండియన్ సర్ఫ్యాక్టెంట్ గ్రూప్ (ISG) వ్యతిరేకించింది. కొత్త టారిఫ్ ప్రతిపాదనను అమలు చేయవద్దంటూ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. అసాధారణ సుంకాలు విధిస్తే పన్నుల నిర్మాణం తారుమారవుతుందని, వినియోగదారు పరిశ్రమలో పోటీ తగ్గుతుందని ఆ లేఖలో ISG ప్రస్తావించింది. ఆయా కంపెనీల ఉపాధి సామర్థ్యం ప్రభావితమవుతుందని పేర్కొంది. ధరల పెంపు ప్రతిపాదనకు కనున కేంద్రం ఆమోదం తెలిపితే ధరలు పెంచక తప్పని పరిస్థితి నెల కొంటుంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల ధరలు పెరుగుతాయి. చివరకు ఆ భారాన్ని మోయాల్సింది సామాన్య జనమే. దీనిపై అంతిమంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే ఇంకొంత కాలం చూడాల్సిందే.

