ఫోటోలు దిగితే టమాటాలు ఫ్రీ..!
– ఫోటో గ్రాఫర్ వినూత్న ఆలోచన
– ఆసక్తిగా మారిన ప్రయోగం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: స్మార్ట్ఫోన్లు చేతిలోకొచ్చాక నానాటికీ పడిపోతున్న ఫోటో గ్రాఫర్ల గిరాకీ తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. అయితే ఫొటోగ్రాఫర్ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి చేసిన ఆలోచనకు అందరు ఫిధా అవుతున్నారు. అదేంటంటే.. ఫోటోలు దిగితే టమాటాలు ఫ్రీగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం బస్టాండ్ కాంప్లెక్స్లో ఆనంద్ అనే వ్యక్తికి ఫొటో స్టూడియో ఉంది. గతంలో స్థానికంగా కలెక్టరేట్ ఉన్నప్పుడు వ్యాపారం బాగానే నడిచేది. ఇటీవల జిల్లా కలెక్టరేట్తోపాటు ఇతర ప్రధాన కార్యాలయాలను పాల్వంచ సమీపంలోని సమీకృత జిల్లా కార్యాలయానికి మార్చడంతో గిరాకీ తగ్గింది. గతంలో రోజుకు 20-30 మంది కస్టమర్లు వచ్చేశారు. ఇప్పుడు కనీసం రోజుకు ఇద్దరు ముగ్గురు కూడా రావడం లేదు.
దీంతో కస్టమర్లను అకట్టుకోవడానికి టమాటా ఆఫర్ ప్రకటించాడు. తన వద్ద రూ.100లకు 8 పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకున్న వారికి పావు కిలో టమాటా ఉచితం అంటూ ప్రకటించి జనాల దృష్టిని ఆకట్టున్నారు. ఈ మేరకు పట్టణంలోని ప్రధాన రోడ్ల కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాడు. కట్ చేస్తే.. ఆనంద్ ఫొటో స్టూడియో ముందు జనాలు బారులు తీరారు. బుధవారం ఒక్కరోజే ఏకంగా 32 మంది కస్టమర్లు వచ్చారు. రూ.100 చెల్లించి 8 ఫొటోలు తీసుకున్న వారికి రూ.40 విలువైన పావు కిలో టమాటా ప్యాకెట్లు అందజేసినట్లు’ ఆనంద్ తెలిపాడు. ఆనంద్ వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభించినట్లైంది. ఈ సంఘటన వైరల్గా కూడా మారింది.
ఇది కూడా చదవండి…

