ఆసుపత్రిలో అరాచకం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆసుపత్రిలో అరాచకం..!
– వార్డుబాయిపై చేయి చేసుకున్న అటెండర్
– సెక్యూరిటీ ముందు మద్యం మత్తులో వీరంగం
– సర్కారు దవాఖానలో వైద్యులు, సిబ్బంది ఆందోళన
– అటెండర్ ను పోలీసులకు అప్పగింత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అరాచకం జరిగింది. చికిత్స కోసం వచ్చిన వృద్ధురాలికి వైద్య సేవలు సక్రమంగా అందించడం లేదని వార్డు బాయిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో ఆసుపత్రి వద్ద వార్డు బాయిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా వైద్యులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా… వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సుశీల(65) అనారోగ్యానికి గురికావడంతో  శుక్రవారం ఆమెను తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తీసుకవచ్చారు.

ఆమెతో పాటు మనుమడు మల్లేష్ కూడా ఆసుపత్రికి వచ్చారు. వైద్య సేవలలో భాగంగా చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రిలోని పైవార్డుకు తరలించారు. రాత్రి వేళ విధుల్లోకి వచ్చిన ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న వార్డుబాయి జహాంగీర్ సుశీలమ్మకు ఆక్సీజన్ అందించే సేవలు అందించారు. అప్పుడే మద్యం సేవించి వచ్చిన సుశీలమ్మ మనుమడు వైద్య సేవలలో వార్డుబాయి నిర్లక్ష్యం చేశారని వాదనకు దిగాడు. అంతలోనే ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రోగి అటెండర్ వార్డు బాయి జహాంగీర్ పై చేతితో పిడిగుద్దుల మాదిరిగా దాడి చేశారు.

వార్డు బాయిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా శనివారం ఉదయం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, అవుట్ సోర్సింగ్ కార్మికులు నిరసనకు దిగారు. రోగి మనుమడు మద్యం తాగి వచ్చి దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. వైద్యులపై, సిబ్బందిపై దాడులు జరగకుండా ఆసుపత్రిలో అవుట్ పోస్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు వార్డుబాయిపై దాడిచేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించి, జరిగిన సంఘటనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదును అందజేశారు.

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు