దర్శిని ప్రతినిధి : తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడగించారు. అడ్మిషన్ ప్రక్రియ గడువును మరోసారి పెంచుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గడువు ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కోఆపరేటివ్, గురుకులాలు, కేజీబీవీ, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలు, కాంపొజిట్ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందొచ్చని సూచించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు చేపట్టాలని కోరారు.

