
గంజాయి అలవాటు కూలీల బైండోవర్..!
– తాండూరు తహసీల్దార్ ముందు హాజరు
– అలవాటు మానుకునేలా ప్రతిజ్ఞ
– మళ్లీ సేవిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : గంజాయికి అలవాటు పడిన పది మంది బీహారీ కూలీలను తాండూరు ఎక్సైజ్ అధికారులు బైండోవర్ చేశారు. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ముందు హాజరు పరిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం మళ్లీ సేవించకుండా ప్రతిజ్ఞ చేయించారు.

వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణంలోని స్టోన్ మిషన్లలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన ముగ్గురు కూలీలు ముక్తార్ ఆలం(31), నిజాం(55), సద్దాం(28)ల వద్ద రూ. 500 గ్రాముల ఎండు గంజాయి లభించడంతో తాండూరు ఎక్సైజ్ ఇంచార్జ్ సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిందితులతో సంబంధాలు కలిగిన వారిని విచారించగా కొంత మందిని గంజాయి సేవించే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శనివారం కేసు నమోదు అయిన నిందితులతో పాటు అర్జున్, భీం, రంగరాజ్, అఫ్తాబ్, సాహిద్, ఫక్రూద్దీన్, ఎండీ గఫ్పార్ అనే వ్యక్తులను తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ముందు బైండోవర్ చేశారు.

ఈ సందర్భంగా అధికారులు వారికి గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి కలిగి ఉండడం, సేవించడం, అమ్మకాలు చేయడం చట్టరిత్యా నేరమని వివరించారు. మళ్లీ గంజాయి జోలికి వెళ్లకుండా ఉండేందుకు వారితో ప్రతిజ్ఞ చేయించారు.

ఇదికూడా చదవండి…

