ఫించన్ కోసం ఊరికి వెళితే ఇళ్లు.. గుల్ల..!
– బంగారం, నగదును చోరి చేసిన దుండగులు
– తాండూరు మాణిక్నగర్లో ఘటన
– దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫించన్ కోసమని ఊరికి వెళ్లిన ఓ మహిళ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.

తాండూరు పట్టణం మాణిక్ నగర్లో బోయిని రాములమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది. అయితే నాలుగు రోజుల క్రితం ఆమె ఫించన్ కోసం సొంత ఊరికి వెళ్లింది. ఆదివారం ఆమె ఇంటి తాళాలు ధ్వంసమై కనిపించడంతో స్థానికులు ఆమె అల్లుడు ప్రభుకు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంట్లో ఉన్న బీరువాను దొంగలు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని చిందర వందరగా పడి ఉన్నాయి. అయితే ఇంట్లో రూ. 50వేల నగదు, ఒక తులం బంగారం, రెండు జతల వెండి పట్టీలు ఉన్నట్లు తెలిపింది.

ఇంట్లో అవి కనిపించకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు నిర్దారించారు. ఇంకా ఏమైనా చోరికి గురయ్యాయో రాములమ్మ వచ్చాకే తెలుస్తుందని అల్లుడు ప్రభు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు.


