వినాయక ఆసుపత్రిలో ఆపరేషన్..!
– మహిళ కడుపులో
10.6 కిలోల క్యాన్సర్ గడ్డ తొలగింపు
– ఆపరేషన్ సక్సెస్ పై సీఈఓ ప్రశాంతి హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని
వినాయక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది. ఆసుపత్రి వైద్యులు తమ నైపుణ్యంతో అత్యంత క్లిష్టమైన క్యాన్సర్ కేసులో 10.6 కిలోల బరువున్న భారీ గడ్డను విజయవంతంగా తొలగించి రోగికి ఊరట కల్పించారు.

తాండూరు పట్టణానికి చెందిన శశికళ గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పి, అసౌకర్యంతో బాధపడుతూ వినాయక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆశ్రయించారు. సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, శరీరంలోని కీలక అవయవాలకు అత్యంత సమీపంలో 10.6 కిలోల బరువున్న క్యాన్సర్ గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

దీంతో ప్రసూతి, గైనకాలజీ నిపుణులు డా. అమృత్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. అర్జున్, అనస్థీషియా నిపుణుడు డా. హరీష్ ప్రత్యేక కార్యాచరణతో శస్త్రచికిత్స చేపట్టారు. గంటలపాటు అత్యంత జాగ్రత్తగా సాగిన ఆపరేషన్లో ఆధునిక వైద్య సాంకేతికతను వినియోగించి 10.6 కిలోల క్యాన్సర్ గడ్డను పూర్తిగా తొలగించారు.

ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నారని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సీఈఓ ప్రశాంతి మాట్లాడుతూ, రోగులకు సకాలంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే తమ ధ్యేయమన్నారు. అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం విజయవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.


