ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
– తాండూరు పుర వీధుల్లో ర్యాలీ
– జిల్లా ఆసుపత్రిలో అల్పాహారం, పండ్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పవిత్ర మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం జమాలియా మిలాద్-ఉన్-నబీ సెలబ్రేషన్స్ సొసైటీ, అహ్లే సున్నత్ వల్ జమాత్ ఆధ్వర్యంలో వేరు వేరుగా పండగను జరుపుకరున్నారు.

జమాలియా మిలాద్-ఉన్-నబీ సెలబ్రేషన్స్ సొసైటీ అధ్యక్షుడు యూసుఫ్ ఆధ్వర్యంలో 31వ వార్డు నుంచి ర్యాలీ ప్రారంభమైంది. పాత తాండూరు, ముర్షద్ దర్గా, గాంధీ చౌక్, ఇంద్రా చౌక్, బస్టాండ్, శాంతా మహల్, రైల్వే స్టేషన్ మీదుగా ర్యాలీ సాగి తిరిగి జమాలియా మిలాద్-ఉన్-నబీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో ప్రత్యేక దర్గాను ఊరేగిస్తూ ముందుకు సాగారు.

పుర వీధుల్లో మతసామరస్యం, సోదరభావం, ఐక్యతను చాటేలా ర్యాలీ కొనసాగింది. మరోవైపు అహ్లె సున్నత్ వల్ జమాత్ ఆధ్వర్యంలో తాండూరు జిల్లా ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ర్యాలీలో మాజీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీమ్, కౌన్సిలర్ యోగానంద్, సంతోష్, ముస్తఫా, ఎం.ఆర్.ఎల్. ఖయ్యూం పాషా, అజీజ్ ఖాన్, తౌఫీక్, జమాల్, షాకీర్, షాఫీ, సత్తార్, చర్చ్ పాస్టర్లు అశోక్రాజ్, ప్రతాప్సింగ్ పాల్గొనగా, పండ్ల పంపిణీ కార్యక్రమంలో అహ్లె సున్నత్ వల్ జమాత్ తాండూరు అధ్యక్షుడు అలావుద్దీన్ ఆదిల్ సాహెబ్, హాఫిజ్ పాషా, అబ్దుల్ హమీద్, పర్వేజ్, మహమ్మద్ అక్రమ్, డాక్టర్ పాషా, అబ్దుల్ రఖీబ్, అకీల్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.


