తాండూరు క్వారీల సమస్యలు పరిష్కరించండి
– మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వినతి
– మనోహర్ రెడ్డి సమక్షంలో మంత్రిని కలిసిన క్వారీ, స్టోన్ అసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని క్వారీ పరిశ్రమల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు.

గురువారం మంత్రి వివేక్ వెంకటస్వామిని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సమక్షంలో క్వారీ, స్టోన్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాండూరులోని నాపరాతి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. క్వారీ వాహనాల రిజిస్ట్రేషన్, జీపీఆర్ఎస్ నిబంధనల్లో సడలింపులు కల్పించాలని కోరారు.

స్లాబ్ రాయితీని అమలు చేయడంతో పాటు రాయల్టీ రేట్లను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. తాండూరు ప్రాంత క్వారీల ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మేజర్ మినరల్ నుంచి మైనర్ మినరల్గా మార్చే ప్రక్రియను పరిశీలించాలని కోరారు. క్వారీస్ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది కార్మికులు, వ్యాపారులు, వాహన యజమానులు, అనుబంధ రంగాల వారు జీవిస్తున్నారని బీఎంఆర్ మంత్రికి వివరించారు. పరిశ్రమకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగితే ఈ వర్గాలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

సమస్యలను సావధానంగా విన్న మంత్రి వివేక్ వెంకటస్వామి.. సంబంధిత అధికారులు, ప్రభుత్వంతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నయూం(అఫ్పూ), మండల క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ప్రతినిధులు ఓం ప్రకాష్ సోమాని, సయ్యద్ హబీబ్, సయ్యద్ జుబేర్ లాల తదితరులు ఉన్నారు.


