కట్ట మైసమ్మ కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి
– తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– ఆదర్శనగర్లో భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తుల కొంగుబంగారంగా కొలువైన కట్ట మైసమ్మ కరుణాకటాక్షాలు తాండూరు ప్రజలందరిపై ఉండాలని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, ఆలయ గౌరవ అధ్యక్షుడు విఠల్ నాయక్ వేడుకున్నారు.

పొలేర అమావాస్యను పురస్కరించుకుని శుక్రవారం ఆదర్శనగర్ పాతకుంటలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఠల్ నాయక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ.. శ్రావణమాస ముగింపు, పోలేర అమావాస్య సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం విశేషమని పేర్కొన్నారు. కట్ట మైసమ్మ అమ్మవారి కరుణాకటాక్షాలు తాండూరు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అల్లంపల్లి ప్రకాష్, నవీన్ కంఠం, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


