జాతి గురించి మాట్లాడితే ఖబడ్దార్..!
– పూటకో పార్టీ మార్చే ఐరన్ లెగ్ రాజుగౌడ్
– వ్యక్తిగత దూషణలపై ఫిర్యాదు చేస్తాం
– కాంగ్రెస్ నాయకులు జాదవ్ రాములు
తాండూరు, దర్శని ప్రతినిధి : జాతి గురించి పిచ్చికూతలు కూస్తే ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాదవ్ రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్కు హెచ్చరించారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ను ఉద్దేశిస్తూ జాతిపై వాఖ్యలు చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు అంటూ పూటకో పార్టీ మార్చే చరిత్ర రాజుగౌడ్ది అని విమర్శించారు. గతంలో ధారాసింగ్, ఉత్తమ్ చంద్ వల్లే కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ టికెట్ దక్కిందనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు.

నమ్ముకున్న వారిని మోసం చేస్తూ పార్టీలు మారారని విమర్శించారు. ఏ పార్టీలో చేరిన ఆ పార్టీకి రాజుగౌడ్ ఐరన్ లెగ్లా మారారని అన్నారు. ఒకే పార్టీలో ఉంటూ గతంలో రోహిత్ రెడ్డి గెలుపుకోసం పనిచేశామని, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోసం పనిచేశామని గుర్తుచేశారు. పూటకో పార్టీ మారుస్తూ విర్రవీగే రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయంగా విమర్శలు చేయడం సహజమేనని, వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదని అన్నారు. ధారాసింగ్పై, జాతిపై వాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాజుగౌడ్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. మరోసారి పిచ్చికూతలు చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.


