నేరాల అదుపుకు నిఘా వ్యవస్థ కీలకం
– సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసు శాఖ కృషి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
-తాండూరు మున్సిపల్లో సీసీ కెమెరాల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నేరాల అదుపులో నిఘా వ్యవస్థ చాలా కీలకమని, పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసు శాఖ కృషి చేస్తుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. తాండూరు మున్సిపల్ పరిధి ఇందినగర్లోని రాంమందిర్, గుండుపీర్లు, పాండురంగా చౌరస్తా, మల్ రెడ్డిపల్లి, మల్లప్ప మడిగ ప్రాంతాల్లో కమ్యూనిటీ పోలీస్ విధానంలో భాగంగా దాతల సహాకారంతో మొత్తం 36 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పట్టణ పోలీస్టేషన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను ప్రారంభించారు. తాండూరు డీఎస్సీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఆయా ప్రాంతాల కౌన్సిలర్లతో కలిసి సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఒక్కో సీసీ కెమెరా వ్యవస్థ వందమంది పోలీసు సిబ్బందికి సమానంగా ఉపయోగపడతాయన్నారు. ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా సీసీ కెమెరాలు నిందితులను పట్టిస్తాయన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కూడ దోహదపడతాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరు ముందుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు బోయరవి, అస్లాం, ప్రభాకర్ గౌడ్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

