దళితబంధుతో స్వ‌యం ఉపాధి

తాండూరు వికారాబాద్

దళితబంధుతో స్వ‌యం ఉపాధి
– ఆర్థిక స‌హాయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఈడీ బాబు మోజస్
– తాండూరు, పెద్దేముల్ మండ‌లాల‌ లబ్దిదారులకు అవగాహన
తాండూరు రూరల్, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి : రాష్ట్రంలోని ద‌ళితుల‌కు స్వ‌యం ఉపాధిని క‌ల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్ర‌వేశ పెట్టింద‌ని, లబ్దిదారులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని వికారాబాద్ జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఈడీ బాబు మోజస్ అన్నారు. ద‌ళిత బంధు కింద తాండూరు నియోజ‌క‌వర్గంలోని తాండూరు మండ‌లం, పెద్దేముల్ మండ‌లంలో 60 మంది ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ల‌బ్దిదారుల‌కు శనివారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కార్పోరేషన్ ఈడీ బాబు మోజన్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన దళితుల పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రభుత్వం దళితబంధును ప్రవేశ పెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా సీసీ కెమెరాల సర్వీసింగ్ ట్రాక్టర్లు, ఆటోలు, మెడికల్, ఫౌల్ట్రీ, ఫోటోగ్రఫీ వంటి ఆర్థిక వ్యాపార రంగాలలో స్వ‌యం ఉపాధిని క‌ల్పిస్తుంద‌న్నారు. ల‌బ్దిదారులు ఈ సహాయాన్ని భూమి, ఆస్తుల కొనుగోలు తప్పా ఇతర వ్యాపారాలకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. ఆయా వ్యాపారాలలో ఆర్థికాభివృద్ధిని పొందాలన్నారు. పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి కుటుంబంలో రూ. 10లక్షల లోపు అందించే రుణాలంలో ఒకే యూనిట్ కాకుండా మూడు యూనిట్ల వరకు పెట్టుకునే అవకాశం కల్పించిందన్నారు. దళితబంధును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి హన్మంత్ రావు, తాండూరు తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు. ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డి. వ్యవసాయ శాఖ అధికారి రజిత, ఎంపీహెచ్ రతన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.