పేదల పెన్నిధిగా సర్కారు బడ్జెట్
– సబ్బండ వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదలకు పెన్నిధిగా ఉందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అభివర్ణించారు. సోమవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టిన తెలంగాణ రాష్ట్ర 2022-23 వార్షిక బడ్జెట్పై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ సబ్బండ వర్గాల బడ్జెట్గా అభివర్ణించారు. దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులను భారీగా పెంచడం, వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమన్నారు. బడ్జెట్లో 17,700కోట్లరూపాయలను కేటాయించడం శుభపరిణామన్నారు. మనఊరు మనబడి, వ్యవసాయం, రైతుబంధు, రైతుభీమా, దేవాలయాల అభివృద్ధి, గొల్ల కురుమల అభివృద్ధి, సొంత స్థలాలు ఉన్నవారికి ఇండ్ల నిర్మాణానికి సహాకారం, విద్యుత్, వైద్యం, రుణాలు, ఆర్టీసీ, మిషన్ భగీరథ, గీత కార్మికులు, మహిళల సంక్షేమం, ఆరోగ్యం, మెట్రో రైల్, పంచాయతీల అభివృద్ధి తదితర విభాగాలలో అధిక ప్రాధాన్యమివ్వడం చాల బాగుందన్నారు. అదేవిధంగా బడ్జెట్పై ముఖ్యమంత్రి కేసిఆర్ గారిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు తెలిపారు.

