ఎలాంటి హామి లేకుండా రూ. 10లక్షల వరకు రుణం
– కేంద్ర ప్రభుత్వ ముద్రా యోజనతో అర్హులకు లబ్ది
దర్శిని డెస్క్ : నిరుపేద వ్యాపారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుంది. ఇందులో ఒకటైన ప్రధాన మంత్రి ముద్రా యోజన ద్వారా లబ్దిదారులకు లక్షల్లో రుణాలను అందజేస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8 ఏప్రిల్ 2015 న ముద్రా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 7 ఏళ్ల సమాచారాన్ని ఆర్థిక శాఖ వెల్లడించింది.ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 34.42 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 18.60 లక్షల కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. వాస్తవానికి స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. చిన్న వ్యాపారానికి రూ. 10 లక్షల వరకు రుణం అందిస్తారు. ఈ పథకం ఎక్కువగా చిన్న వ్యాపారాలు ప్రారంభించేవారికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకంలో రూ.50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు అందిస్తారు. ఇప్పటివరకు 68 శాతం మహిళలకు, 22 శాతం కొత్త పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరు చేశారు. ఈ పథకం కింద జారీ చేసిన అన్ని రుణాలలో 51 శాతం SC / ST / OBC కేటగిరీలకు అందించారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ. 10 లక్షల వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా ప్రభుత్వం రుణం ఇస్తుంది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు, తయారీ, వ్యాపారం, సేవా రంగం, వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారం కోసం ముద్రా యోజనలో రుణాలు అందిస్తారు. దీని కింద మూడు రకాల రుణాలు ఇస్తారు. – శిశు రుణం రూ. 50,000 వరకు, కిషోర్ రుణం 50,000 నుంచి 5 లక్షల వరకు, తరుణ్ రుణం రూ. 10 లక్షల వరకు ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలంటే
ముందుగా ముద్రా యోజన అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. లోన్ కావాలనుకుంటున్న కేటగిరీ పై క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి దరఖాస్తు ఫారము డౌన్లోడ్ చేసుకోండి. దరఖాస్తు ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోండి. దరఖాస్తు ఫారమ్లో అడిగిన మొత్తం సమాచారాన్ని చదవండి. తదనుగుణంగా పూర్తి చేయాలి. కొన్ని పత్రాల పోటోకాపీలు అడుగుతారు. అవి యాడ్ చేయండి. ఈ దరఖాస్తు ఫారమ్ ను మీ సమీపంలోని బ్యాంకుకు వెళ్లి సమర్పించండి. బ్యాంక్ మీ దరఖాస్తును ధృవీకరిస్తుంది 1 నెలలోపు రుణం మంజూరు చేస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి పేరు, పాస్వర్డు సృష్టించాలి. దీని సాయంతో ముద్రా లోన్ వెబ్సైట్ లాగిన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జతచేయాల్సిన పత్రాలు
దరఖాస్తు చేసే ఫారమ్ను నింపడానికి కొన్నతి పత్రాలు తప్పక అవసరమవుతాయి. మీ వద్ద ఆధార్, పాన్ ఉండాలి. మీ శాశ్వత చిరునామా, వ్యాపార చిరునామా, నివాస స్థలం రుజువు, మూడేళ్ల బ్యాలెన్స్ షీట్, ఆదాయపు పన్ను రిటర్న్, స్వీయ-పన్ను రిటర్న్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో దించాలి.

