పల్లె, పట్టణ ప్రగతి వాయిదా
– జూన్ 3 నుంచి చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
– మంత్రుల విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె పగ్రతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ స్పందించి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయం మేరకు జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బుధవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో పల్లె, పట్టణ ప్రగతిపై మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు.

