రేపే ఇంటర్ ఫలితాలు..?
– 25 లేదా 26న టెన్త్ రిజల్ట్స్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ విద్యార్థులకు కీలక విషయాన్ని వెల్లడించింది. ఇంటర్ ఫలితాలను జూన్ 15న ప్రకటించనున్నట్లు తెలిపింది. మే 6 నుంచి 24 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన తరువాత సమాధానల పత్రాల మూల్యాంకనం 14 కేంద్రాల్లో చేపట్టారు. గతేడాది కోవిడ్ కారణంగా ఆల్పాస్ ఫార్ములాను ప్రకటించిన ఇంటర్ బోర్డు ఈ ఏడాది పరీక్షల ఫలితాలను ప్రకటించిన తేదీ కంటే ముందుగానే విడుదల చేసేందుకు సిద్ధమయ్యింది. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్సైట్ sbie.cgg.gov.inలో తనిఖీ చేసుకోవచ్చు.
25 లేదా 26న పది ఫలితాలు
మరోవైపు తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలపై ఇంకా స్పష్టత రాలేదు. గతనెల మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. టెన్త్ పబ్లిక్ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. వీటికి సంబంధించిన ఫలితాలు (TS 10th Class Results 2022) జూన్ 25 లేదా 26 నాటికి ప్రకటిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు జూన్ 1కి బదులుగా కాలేజీలు నెల రోజులు ఆలస్యంగా ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది జూన్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే తరగతులను ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జులై 1 నుంచి ఇంటర్మీడియట్ విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది.



