గురుకులాల్లో 9వేల పోస్టులు
– టీఎస్పీఎస్సీ ద్వారా మరో 995 ఖాళీల భర్తి
– త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నా సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సర్కారు మరో తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు టీఎస్పీఎస్సీ ద్వారా కూడ ఖాళీలను భర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల్లో గురుకుల పాఠశాలలకు సంబంధించిన పోస్టులు 9,096 వరకు ఉండగా.. వీటిల్లో బీసీ గురుకులాల్లో 3,870 పోస్టులు, గిరిజన గురుకులాల్లో 1,514 పోస్టులు, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులను భర్తీ చేయబోతోంది. ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా మిగిలిన 995 పోస్టులను భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్లు త్వరలో విడుదలవ్వనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విటర్ ద్వారా వెల్లడించారు.



