ఫీల్డ్ అసిస్టెంట్కు మూడు నెలల జైలు
– రూ. 2 వేల జరిమాన విధింపు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఉపాధి హామి పథకంలో కూలీల డబ్బులను కాజేసిన ఫీల్డ్ అసిస్టెంట్ కు మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ. 2వేల జరిమాన విధిస్తూ తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయస్థానం తీర్పు వెలువరించిందని తాండూరు మండలం కరణ్ కోట్ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మిట్టబాస్పల్లి గ్రామానికి చెందిన నందిగామ నాగప్ప(55) ఉపాధి హామి పథకంలో ఫీల్డ్ అసిసెంట్గా పనిచేసేవాడు. 2012లో గ్రామానికి చెందిన కూలీలకు సంబంధించి కూలీ డబ్బులను పోస్టాఫీసు నుంచి తీసుకవస్తానని కొందరి వద్ద విత్ డ్రా రసీదులపై సంతకాలు తీసుకుని, మరికొందరి సంతకాలను ఫోర్జరీ చేసి రూ. 30 వేల 513లను కాజేసి సొంత అవసరాలకు వాడుకున్నాడు. తపాల శాఖకు చెందిన ఇను స్పెక్టర్ లక్ష్మీమాధవి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ పవన్ నిందితుడిపై చార్జీషీట్ నమోదు చేశారు. సోమవారం తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి టీ.స్వప్న కేసు పూర్వాపరాలను పరిశీలించి నిందితుడు నందిగామ నాగప్పకు 3నెలల జైలు శిక్షతో పాటు రూ. 2వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు వెల్లడించారు.



