పది నెలల చిన్నారికి రైల్వే ఉద్యోగం
– రైల్వే శాఖలో అరుదైన నియామకం
దర్శిని డెస్క్ :కేంద్ర రైల్వే శాఖలో ఓ 10 నెలల చిన్నారికి ఏకంగా రైల్వే ఉద్యోగం లభించింది. ఈ సంఘటనలో రైల్వే శాఖలో అరుదైన నియామకంగా నమోదయ్యింది. బహుశా! రైల్వే చరిత్రలో ఇంత చిన్న వయసు పసికందుకు ఉద్యోగం ఇవ్వడం ఇదే మొదటిసారి అయ్యి ఉంటుంది. వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్గఢ్రాష్ట్రానికి చెందిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్పూర్ రైల్వే డివిజన్ అరుదైన కారుణ్య నియామకం జరిగింది. భిలాయ్లోని పీపీ యార్డ్లో రాజేంద్ర కుమార్ యాదవ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. జూన్ 1న రాజేంద్ర కుమార్ తన కుటుంబంతో కలిసి భిలాయ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర, అతని భార్య మంజు యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరి పాప రాధిక మాత్రమే ఈ ప్రమాదం నుంచి బయటపడింది. తల్లిదండ్రులను కోల్పోయిన రాధికను అమ్మమ్మ పెంచుతుంది. నిబంధనల ప్రకారం ఇటీవల రాజేంద్రకుమార్ స్థానంలో ఆయన కూతురు రాధికకు కారుణ్య నియమకానికి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేశారు. 10 నెలల రాధిక అనే బాలికకు కారుణ్య నియామకం కింద రైల్వే అధికారులు బుధవారం రైల్వే ఉద్యోగం కోసం రిజిస్ట్రేషన్ చేశారు. నిబంధనల ప్రకారం చిన్నారికి 18 ఏళ్లు నిండిన తర్వాత రైల్వే శాఖ ఆ ఉద్యోగాన్ని ఇవ్వనుంది.



