రైతుబీమా దరఖాస్తులకు ఆహ్వానం
– తప్పుల సవరణకు నేడు ఆఖరి గడువు
– బీమా రెన్యూవల్కు అవకాశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిది: రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ సర్కారు ప్రవేశ పెట్టిన రైతుబీమా పథకానికి వ్యవసాయ శాఖ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు జారీ చేసింది. కొత్తగా రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో పాటు గతంలో చేసుకున్న నమోదును రెన్యువల్ చేసుకునేందుకు అకాశం కల్పింస్తోంది. 1963 ఆగస్టు నుంచి 2004 ఆగస్టు మధ్యకాలంలో జన్మించిన రైతులను అంటే 18- 59 ఏండ్ల మద్య వయస్సు ఉన్న రైతులను అర్హులుగా ప్రకటించింది. గత జూన్ 22 తేదిని నాటికి ధరణిలో పట్టా పాసుపుస్తకం పొందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
దరఖాస్తు చేసుకునే విధానం
పట్టా పుస్తకం పొందిన రైతులు రైతుబీమా దరఖాస్తు కోసం ఫారం నింపాల్సి ఉంటుంది. పట్టాదారు పాసుపుస్తకంతో పాటు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు వివరాలతో పూరించిన దరఖాస్తు పత్రాన్ని ఆయా మండలాలు, గ్రామాలలకు ఏఈఓలు, ఏఓలకు అందజేయాలి. ఒకవేళ కొత్త పుస్తకం ఇంకా రాలేని వారు తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసిన పాసుపుస్తకం జిరాక్సులను పెట్టి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు గతంలో రైతుబీమా చేసుకున్న రైతులు రెన్యూవల్ కూడ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీనిపై నేటి నుంచి అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు.
నేటి వరకు తప్పుల సవరణకు అవకాశం
గతంలో రైతుబీమాలో నమోదు చేసుకున్న రైతులు తమ వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లైతే సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. నామిని చనిపోతే ఆ స్థానంలో పేరు మార్పు, రైతుతో నామిని సంబంధం ఏదైనా తప్పుగా పడి ఉంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. బీమాలో మార్పులు, చేర్పుల కోసం సంబంధిత క్లష్టర్ల వారీగా మండల వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ నెల 20న బుధవారం లాస్ట్ డేట్ కావడంతో ఈ అవకాశం రైతులు వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది. సంబంధిత దరఖాస్తు పూర్తి చేసి.. కావాల్సిన డాక్యుమెంట్స్ జత చేసి సాఫ్ట్వేర్లో సరిచేసుకోవాలని పేర్కొంది.



