వాళ్ల వ‌ల్లే కారు చిచ్చు..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

వాళ్ల వ‌ల్లే కారు చిచ్చు..!
– కుర్చీ దించేందుకు త‌గ‌ని రాద్దాంతం
– రెండున్నరేళ్లు అభివృద్ధిని అడ్డుకున్నారు
– క్రమశిక్షణపై మాట్లాడే అర్హత వాళ్లకు లేదు
– మీడియా సమావేశంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ చైర్ పర్సన్ కుర్చీ వ్య‌వ‌హారంతో కారులో చిచ్చు పెడుతోంది ఎమ్మెల్యే వ‌ర్గీయులే అని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్, కౌన్సిల‌ర్లు విమ‌ర్శించారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాజీ వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల రత్నమాల న‌ర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, ప్రవీణ్ గౌడ్, రాము, రవి, వెంకన్న గౌడ్, సల్మా పాతిమాలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ కుర్చీ విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన వాఖ్య‌ల‌ను ఖండించారు. పదవి చేపట్టిన రెండున్నరేళ్లలో ఎమ్మెల్యే వర్గీయులే ప్ర‌తిప‌క్షాల‌తో అభివృద్ధి చేయనీయకుండా అడ్డుకున్నారని అన్నారు. రెండేళ్లుగా మున్సిపల్ కమీషనర్‌ను రానీయకుండా ఆర్డీఓపై ఇంచార్జ్ గా నియమించి భారం మోపి ఆయ‌న గౌర‌వాన్ని దిగజార్చ‌ర‌ని అన్నారు. ఒప్పందం ప్రకారం కుర్చీ దిగాలంటూ ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిపై బుర‌ద జ‌ల్లే రాజ‌కీయాలు చేస్తూ రాద్దాంతం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గీయులు చేస్తున్న రాద్దాంతంతోనే పార్టీలో చిచ్చురేపుతున్నార‌ని అన్నారు. అలాంటి వారు క్రమశిక్షణ గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ నుంచి కారు ఎక్కిన వాళ్ల నుంచి చేసే పెత్తనం సహించమన్నారు. మున్సిపల్ ఒప్పందంలో కుర్చీ మార్పుపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీనిపై అధిష్టానం మాకు సానుకూలంగా స్పందించి అవకాశం కల్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చాల సందర్భాలలో పేర్కొన్న విధంగా నా మొదటి సంవత్సరం కరోనా వల్ల అభివృద్ధి చేయలేకపోయామన్నారు. వారికి వర్తించిన నినాదం మాకు వర్తించేలా మ‌హిళ చైర్ ప‌ర్స‌న్‌గా తోడ్పాటు అందించాల‌న్నారు.

రక్ష‌ణ క‌ల్పించాలి
మరోవైపు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి నుంచి దించేందుకు భ‌యాందోళ‌న వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నార‌ని చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అన్నారు. ప్రస్తుతం రాత్రి సమయాల్లో ఇంటిపై, కార్లపై రాళ్లు రువ్వుతున్నారని ఆరోపించారు. మాకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యే గారిదే బాధ్యత అన్నారు. తమకు జిల్లా ఎస్పీ, డీఎస్పీ గారు రక్షణ కల్పించాలన్నారు. ఇప్ప‌టికే తన భర్త పరిమళ్ గుప్తపై వివిధ రకాల కేసులను నమోదు చేయించారని ఆరోపించారు. మరోవైపు కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు తాండూరుకు మంజూరైన బైపాస్ రోడ్డులో తన వార్డులోని బాధితులకు పరిహారం అందించలే ‘కపోయాన్నారు. తన వార్డులో ఎమ్మెల్సీ హయాంలోనే 1.60 కోట్ల అభివృద్ధి చేశానని, ఇంకా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు బిల్లుల జాప్యంతో పనులు జరగలేదని. గతంలో దీపా నర్సింలు చేసిన వాఖ్యలకు బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.