సీఎం కేసీఆర్ సభను అడ్డుకుందాం
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్
– అందరు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 16న వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సభను అడ్డుకుందామని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు తాండూరు పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ తాండూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన హామిని నిలబెట్టుకోకపోవడం దారుణమని విమర్శించారు. తాండూరులో ఏర్పాటు చేయాల్సిన మెడికల్ కాలేజీని వికారాబాద్ కు కేటాయించడంతో స్థానిక ప్రాంత వాసుల ఆశలను అడియాశలు చేశారని మండిపాటు వ్యక్తం చేశారు. కావున ఈనెల 16న వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్ సభను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తాండూరు నియోజకవర్గం నుంచి ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.



