కామాంధ సర్పంచ్కు ఉరే సరి..!
– పదవి నుంచి సస్పెండ్ చేసి.. రిమాండ్ చేయాలి
– బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కామంతో మతిస్థిమితం లేని అమ్మాయిపై అఘాయిత్యయత్నానికి పాల్పడిన సర్పంచుకు ఉరి సరైన శిక్ష అని బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ అన్నారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం నంద్యానాయక్ తాండాలో బాలికపై సర్పంచ్ శంకర్ నాయక్ అత్యాచారాయత్నానికి పాల్పడడంపై శనివారం బీజేపీ నేతలు ఖండించారు. తాండూరు రూరల్ సీఐ రాంబాబును జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ నేతలతో కలిసి బాధిత కుటుబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా అందించారు. ఈ సందర్భంగా యు.రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల దురహంకార చేష్టలు పెరుగుతున్నాయన్నారు. మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిసి బాలికపై సర్పంచ్ అత్యాచార యత్నానికి పాల్పడడం దుర్మార్గమన్నారు. వెంటనే అతన్ని పదవి నుంచి తొలగించి అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీసులను కోరారు. బాలికపై అత్యాచారాయ యత్నానికి పాల్పడిన అతినికి ఉరి శిక్ష వేయాలన్నారు. మరోవైపు జరిగిన సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే బందువు బాధిత కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంతారం లలిత, వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత, తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, యాలాల మండల ఇంచార్జ్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన గిరిజన నాయకులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై తాండూరు ప్రాంత గిరిజన నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆల్ ఇండియా గిరిజన నాయకులు వాసు పవార్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన నాయకులు కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా అందించారు.

