ఆదేశాలు దిక్కరిస్తే జైలు శిక్షే పరిష్కారం
– తెలంగాణ సర్కారుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
– ఏపీ విద్యుత్ ఉద్యోగుల పోస్టింగ్ జాప్యంపై అసహనం
దర్శిని డెస్క్ : తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ఆంధ్ర నుంచి రిలీవ్ అయిన 84 మందికి పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. కోర్టు ఆదేశాలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని ధర్మాసనం ఆక్షేపించింది. జస్టిస్ ధర్మాధికారి ఏక సభ్య కమిటీ నివేదిక పైనల్ అని పలుసార్లు సుప్రీం స్పష్టం చేసినా తెలంగాణ కావాలనే అమలు చేయడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆంధ్రా నుంచి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై ఉన్నతన్యాయస్థానం మండిపడింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన విద్యుత్శాఖ అధికారులకు జైలుశిక్షే పరిష్కారమని వ్యాఖ్యానించింది. ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు ఇదే చివరి అవకాశమని.. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను 31కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

