మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ బాహాబాహి

క్రైం తెలంగాణ హైదరాబాద్

మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ బాహాబాహి
– పలివెలలో ఈటెల కాన్వాయ్‌పై రాళ్ల దాడి
– సీరియస్ అయిన ఎన్నికల కమీషన్
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: నల్లగొండ జిల్లాలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్, బీజేపీ మద్య బాహాభాహికి దారితీసింది. మునుగోడు మండలం పలివెల గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఈటల రాజేందర్‌ ప్రచారం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి.
ఇరువర్గాలు ప్రచారం చేస్తున్న క్రమంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఇరువర్గాలు కర్రలతో, రాళ్లతో దాడి చేసుకున్నాయి. దీంతో పలివెలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా.. ఈ ఘటనపై ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. చోద్యం చూస్తున్నారా అంటూ పోలీసులపై ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు. కావాలనే రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కొద్ది సేపటికి పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థిని అదుపులోకి తీసుకువచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పరస్పర దాడులతో పలివెలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. పలివెల ఘటనపై ఎన్నికల కమిషన్ సిరియస్ అయింది. పలివెలకు వెంటనే.. అదనపు బలగాలను పంపాలని ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.