ఒకే రోజులో 35 ప్రసవాలు
– రికార్డు కొట్టిన జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రి
– అభినందించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఒకే రోజులో 35 ప్రసవాలు చేసి రికార్డు సాధించింది తెలంగాణ రాష్ట్రంలోని జనగామా మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్). అరుదైన రికార్డును సాధించిన ఆసుపత్రి వైద్య సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి హరిష్ రావు అభినందించారు. మంగళవారం జనగామ ఎంసీహెచ్ ఈ ఘనతను సాధించింది. ఒక గైనకాలజిస్ట్, ఇద్దరు రెసిడెంట్ వైద్యులతో 35 మందికి ప్రసవాలు చేశారు. గైనకాలజిస్టు శోభారాణి ఆధ్వర్యంలో ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు గర్భిణుల్లో 14 మందికి సాధారణ ప్రసవాలు చేయగా 21 మందికి శస్త్ర చికిత్స కాన్పులు జరిగాయి. ఈ స్థాయి ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా ఒకే రోజు ఇన్ని ప్రసవాలు జరగలేదని ఎంసీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్రాజు తెలిపారు. అరుదైన రికార్డు సాధించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ట్విటర్ ద్వారా వైద్యులను అభినందించారు.

