ప్రధాని పర్యటన తాత్కాళిక వాయిదా
– ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన
– త్వరలోనే కొత్త షెడ్యూల్ వివరాలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఈనెల 19న తెలంగాణ రాష్ట్రంలో ఖరారైన ప్రధాని నరేంద్రమోడి పర్యటన తాత్కాళికంగా వాయిధా పడింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నుంచి ప్రకటన వచ్చింది. తెలంగాణ పర్యటన సందర్భంగా మోదీ దాదాపు రూ.7000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. సికింద్రాబాద్-మహబూబ్నగర్ మధ్య 85 కి.మీ మేర డబ్లింగ్ రైల్వే లైన్ను మోదీ ప్రారంభించనున్నారు. దీంతోపాటు ఐఐటీ హైదరాబాద్లోని అకడమిక్ భవనాలు, వసతి గృహాలు, ఫ్యాకల్టీ, స్టాఫ్ భవనాలు, టెక్నాలజీ రీసెర్చ్ పార్కు, కన్వెన్షన్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్, అతిథిగృహం, లెక్చర్ హాల్ కాంప్లెక్స్, హెల్త్ కేర్ తదితర భవనాలను మోదీ ప్రారంభించాల్సి ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను రూ.699 కోట్ల వ్యయంతో రీడెవలప్మెంట్ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దానికి సంబంధించిన పనులకూ ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. కాని ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్లో మార్పుల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలో పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉంది. కొత్త షెడ్యూల్ను త్వరలోనే తెలియజేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

