ఫ్రీ రేషన్కు గ్రీన్ సిగ్నల్
– బియ్యం పంపిణీకి సర్కారు ఆదేశం
– కాని ఒక్కొక్కరికి 5 కిలోలే
దర్శిని డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ అందింది. దీంతో బియ్యం పంపిణీ ఆందోళనకు తెరపడింది. దేశంలోని రేషన్కార్డులకు ఈ ఏడాది పాటు ఉచిత బియ్యం పంపిణీ పొడిగిస్తున్నట్లు మోడీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పెట్టేందుకు ముందుగా నిర్ణయించుకోగా, తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. జనవరి నెల నుంచి కేంద్రం ఇచ్చే ఆ ఐదు కిలోల బియ్యాన్ని తిరిగి పంపిణీ చేస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. జనవరి నెల నుంచి సంవత్సరం పాటు రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. గతంలో కేంద్రం జారీచేసిన జాతీయ ఆహార భద్రత కార్డులకు 5 కిలోలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మరో కిలో కలిపి 6 కిలోలు బియ్యం ఇచ్చేది. అలాగే రాష్ట్ర ఆహార భద్రత కార్డులకు 6 కిలోల చొప్పున ఇచ్చేది. ఇకపై అన్ని కార్డులపైనా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పునే బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులు పేద ప్రజలకు ఆందోళన కలిగించింది. అయితే తన నిర్ణయాన్ని మార్చుకున్ని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం ఉచితంగా ఇస్తున్న 5 కిలోల బియాన్ని బుధవారం నుండి రేషన్ కార్డుదారులందరికీ పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

