అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

క్రైం తాండూరు వికారాబాద్

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
– యాలాల మండలం బండమీదిపల్లిలో ఘటన
– రైతు కుటుంబంలో విషాధం
యాలాల, దర్శిని ప్రతినిధి : అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం బండమీదిపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బొల్లే అంజిలయ్య(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రబీలో 3 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేసాడు. రెండు రోజుల కిందటే పంట కోసి కళ్ళం కూడా వేశాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్య పార్వతమ్మతో కలిసి పొలంలోనే ఉన్నారు. అర్దరాత్రి లేచి చూసే సరికి అంజిలయ్య కనిపించలేదు. దీంతో ఆమె సెల్‌ ఫోన్‌ టార్చ్‌ లైట్‌తో వెతకగా సమీపంలో ఉన్న వేప చెట్టుకు అంజిలయ్య ఉరేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపింది. పోలీసులకు కూడ సమాచారం అందించారు. అయితే వ్యవసాయం కోసం చేసిన సుమారు రూ.7 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు, వాటిని తీర్చేందుకు మధనపడే వాడని భార్య పార్వతమ్మ తెలిపారు. అప్పుల బాధతతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేధన వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్యతో కుటుంబంలో విషాదం నెలకొంది. మరోవైపు రైతు భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు