ప్రైవేటు ప్రాంతంలో పారిశుద్ధ్య పనులా..?
– ఎగ్జీబీషన్ వద్ద మున్సిపల్ కార్మికులు
– కళ్లు మూసుకున్న అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పబ్లిక్ ప్రదేశాల్లో పనులు చేయాల్సిన మున్సిపల్ కార్మికులు ప్రైవేటు ప్రాంతాల్లో పారిశుద్య పనులు చేస్తున్నారు. ఈ పరిణామాలు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కొందరు మామూళ్ల కోసం ఇలాంటి పనులు చేస్తుంటే.. అధికారులు కన్నెత్తి చూడకపోవడం కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం తాండూరు పట్టణం విలియమూన్ పాఠశాల మైదానంలో ఎగ్జీబీషన్ ప్రారంభమయ్యింది. ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎగ్జీబీషన్ కొనసాగుతోంది. ఎగ్జీబీషన్ గ్రౌండ్ మొత్తం ప్రైవేటు నిర్వహకుల ఆదీనంలోనే ఉంది. అయితే కొన్ని రోజులుగా తాండూరు మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. నిర్వహకులు ఇచ్చే మామూళ్ల కోసం ఈ పనులు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులకు కూడా కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి చర్యలపై పలువురు ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.

