రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్
– మైనర్ బాలుడిపై దాడి
– రంగారెడ్డి జిల్లాలో ఘటన
రంగారెడ్డి జిల్లా, దర్శిని ప్రతినిధి: గంజాయి మత్తులో గ్యాంగ్ రెచ్చిపోయింది. మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానిక పోలీస్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాలల ప్రకారం.. గ్రామంలోని కిరాణా దుకాణంలో కూర్చున్న బాలుడిని బలవంతంగా సమీపంలోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ గంజాయికి డబ్బులు ఇవ్వాలని బాలుడి బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారు. అంతటితో ఆగగుండా ‘‘నీకు దిక్కున్న చోట చెప్పుకో.. ఇప్పటికే ఇద్దరిని హత్య చేశాం’’ అని గ్యాంగ్ సభ్యులు బాలుడిని బెదిరించినట్లు సమాచారం. గంజాయి గ్యాంగ్ నుంచి ఎలాగో తప్పించుకొని బాలుడు తన ఇంటికి చేరుకున్నాడు. ఒంటిపై గాయాలు చూసిన బాలుడి కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. జరిగిన విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు.. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహమ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్తోపాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్దేవ్పల్లి పోలీసులు తెలిపారు.

