వాహనదార్లకు.. తప్పిన ముప్పు !

క్రైం తాండూరు వికారాబాద్

వాహనదార్లకు.. తప్పిన ముప్పు !
– రోడ్డు పక్కన తగలబడ్డ మామిడి చెట్టు
– మంటలార్పిన ఫైర్, పోలీస్ సిబ్బంది
– లక్ష్మీనారాయణపూర్ లో సంఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వాహనదారులకు పెద్ద ముప్పు తప్పింది. సకాలంలో పోలీస్, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు పక్కన తగలబడ్డ మామిడి చెట్టు ను మంటలార్పారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నుండి లక్ష్మీనారాయణపూర్ కు వెళ్లే దారిలో ఎస్సార్ పెట్రోల్ పంపు ముందు రోడ్డుప్రక్కన ఉన్న మామిడి చెట్టు తగలబడింది.ఈ విషయాన్ని గ్రహించిన పక్కనే ఉన్న పొలం యజమాని ఆర్ వి రెడ్డి తాండూరు ఫైర్ సిబ్బందితోపాటు, యాలాల పోలీసులకు సమాచారం అందించాడు.

హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్, పోలీసు సిబ్బంది రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ను నిలిపివేసి సుమారు గంటపాటు శ్రమించి మంటలు ఆర్పారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడం వల్ల పెద్ద ముప్పు తప్పిందని వాహనదారులు సంతోషించారు. లేకుంటే తగలబడ్డ మామిడి చెట్టు అటుగా వెళ్లే వాహన దారులపై పడితే పెద్ద ప్రమాదం ఏర్పడేదని వాహనదారులు చర్చించుకున్నారు.పొలం యజమాని ఆర్ వి రెడ్డి సమాచారం అందించిన వెంటనే స్పందించిన యాలాల ఎస్సై అరవింద్ సంఘటనా స్థలానికి ఏఎస్ఐ రాజశేఖర్ తో పాటు మిగతా సిబ్బందిని పంపించారు. దీంతో గంటపాటు శ్రమించిన ఏఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ అహ్మద్, శ్రీనివాస్, గోపాల్ అక్కడి ట్రాఫిక్ ను క్లియరెన్స్ చేశారు. అదేవిధంగా తాండూరు ఫైర్ స్టేషన్ అధికారి జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో మిగతా సిబ్బంది కూడా మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.