గ్యాస్ లీకేజీలపై అప్రమత్తంగా ఉండాలి
– బీఆర్ఎస్ కౌన్సిలర్ విజయాదేవి రంగారావు
– 28వ వార్డులో అగ్నిమాపకశాఖ అధికారుల అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి: వంటింట్లో గ్యాస్ సిలిండర్ల లీకేజీ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ విజయాదేవి రంగారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 28వ వార్డులో తాండూరు అగ్నిమాపక శాఖ అధికారి నాగార్జున ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ విజయాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ సిలిండర్ లీకేజీ, దాని వల్ల సంభవించే అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అలాంటి పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాలను ఎలా నియంత్రించాలో వివరించారు. అనంతరం కౌన్సిలర్ విజయాదేవి మాట్లాడుతూ మహిళలు గ్యాస్ సిలిండర్ లీకేజీ, ఇతర ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫైర్ ఆఫీసర్ల సూచనలు పాటించాలని సూచించారు. ఫైర్ ఆఫీసర్ నాగార్జున మాట్లాడుతూ గ్యాస్ లీకేజీ అయినట్లు తెలిస్తే ఇంట్లో అన్ని కిటికీలు తెరచి ఉంచాలని, చిన్న చిన్న చిట్కాలతో గ్యాస్ లీకేజీ ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు, ఫైర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

