దివ్యాంగులకు అదనపు ఆసరా..!
– వచ్చే నెల నుంచి ఫించన్ పెంపు
– ప్రకటించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల పింఛన్ను మరో వెయ్యి పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. వచ్చే నెల నుంచి వికలాంగులకు రూ.4,116 పింఛను చెల్లిస్తామన్నారు. శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన భారాస బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ‘‘ సంక్షేమంలో, వ్యవసాయంలో బాగున్నాం. సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర. ఇది మన సొంత ఆస్తి. వేలాది మందికి అన్నం పెట్టి సాధించిన సంస్థ. కాంగ్రెస్ సింగరేణిని సర్వనాశనం చేసింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తీసుకొచ్చింది. మన సొంత కంపెనీని అప్పులు చెల్లించక 49శాతం వాటా కింద కేంద్రానికి కట్టబెట్టింది. 2014లో భారాస రాకముందు కార్మికులకు బోనస్ 18శాతమే. అంటే.. రూ.50-60 కోట్లు మాత్రమే. తెలంగాణ వచ్చాక సింగరేణి నడక, స్టైల్ మారింది. కేవలం రూ.11వేల కోట్లు మాత్రమే సింగరేణి టర్నోవర్ ఉండేది. ఇప్పుడు రూ.33వేల కోట్లకు పెంచుకున్నాం. సింగరేణికి లాభాలు గతంలో రూ.300-400 కోట్లు మాత్రమే ఉండేది. ఇవాళ రూ.2,184 కోట్ల లాభాలు గడించింది. గతంలో రూ.50-60 కోట్లు బోనస్ ఇచ్చేవారు. కానీ, ఈసారి దసరాకు సింగరేణి కార్మికులకు ఇచ్చే బోనస్ రూ.700 కోట్లు పంచబోతున్నాం. ఆనాడు కంపెనీకి వచ్చే లాభాల కన్నా మూడు రెట్లు బోనస్ ఇచ్చే పరిస్థితికి సింగరేణిని తీసుకొచ్చాం.’’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏకంగా 19,463 ఉద్యోగాలు కల్పించాం. మొత్తం 1,556 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. కార్మికులు దురదృష్టవశాత్తు చనిపోతే కేవలం రూ.లక్ష ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపేసుకుంది. కానీ, భారాస ప్రభుత్వం ప్రమాద బీమాను పెంచి రూ.10లక్షలు ఇస్తోంది. రిటైర్మెంట్ తీసుకున్నాక రూ.25లక్షలు ఇస్తున్నాం. కార్మికులకు ఇంటి నిర్మాణం కోసం వడ్డీ లేకుండా రూ.10 లక్షలు అందిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి…


