బీఆర్ఎస్ సర్కారుది అవినీతి పాలన..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ సర్కారుది అవినీతి పాలన..!
– ఇచ్చిన హామిలను విస్మరించిన కేసీఆర్
– ఎన్నికల్లో కుటుంబ పాలన అంతం కావాలి
– కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
– ఏఐసీసీ అధికార ప్రతినిధి షమా మహమ్మద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు అవినీతి పాలన చేసిందని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ విమర్శించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎన్వీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ఆమె హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షమా మహమ్మద్ తమిళనాడు ఇంచార్జ్ రియాజ్ తో పాటు తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 9 ఏండ్లు పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామిలన్నీంటిని విస్మరించిందన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, కే జీ టూ పీజీ విద్య వంటి తదితర హావి లలను నెరవేర్చలేదన్నారు.

కాని ప్రగతి భవన్, సెక్రటరీయేట్ కార్యాలయాలను నిర్మించుకుందన్నారు. అదేవిధంగా కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. సర్కారు ప్రవేశ పెట్టిన దళిత బందులో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. రూ. 1 లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న పథకాలపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. కర్ణాటకలో గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కావాలంటే కర్ణాటకకు వెళ్లి పరిశీలించవచ్చని సవాల్ చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో అవినీతి పాలన అంతం కావాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

తాండూరులో ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. మరోవైపు కోట్‌పల్లి మండలానికి చెందిన బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలయ్య డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కల్వ సుజాత, జిల్లా మహిళ అధ్యక్షురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

 మోసపోవద్దు గొసపడతాం..