రేపే హుజురాబాద్ కౌంటింగ్
– ఓట్ల లెక్కింపునకు చకచకా ఏర్పాట్లు
– వీవీ ప్యాట్లో ఓట్లు ఉండవు: ఆర్వో వెల్లడి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ రేపు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేశారు. మంగళవారం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపట్టబోతున్నారు. ఈ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు, వివాదాలకు తావులేకుండా, సజావుగా నిర్వహించాలని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు జాగ్రత్తగా చేపట్టాలని, పోటీచేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంల సీల్ తొలగించి ఓట్లు లెక్కించాలని ఆదేశించారు.
14 టేబుల్స్.. 22 రౌండ్లలో లెక్కింపు
పోలింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపర్చారు. ఇక్కడ స్థానిక పోలీసులతోపాటు కేంద్ర బలగాలతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఏర్పాటుచేశామని, 22 రౌండ్లలో లెక్కింపు పూర్తిచేస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు. కౌటింగ్ను దృష్టిలో ఉంచుకుని కళాశాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించి మూడంచెల భద్రతను కల్పించారు. ఈవీఎం లు మార్చారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రవీందర్రెడ్డి ఖండించారు. మాక్ పోలింగ్లో మొరాయించిన వీవీ ప్యాట్ను ఒక అధికారిక వాహనం నుంచి మరో అధికారిక వాహనంలోకి మార్చామని తెలిపారు. వీవీ ప్యాట్లో ఓట్లు ఉండవని, ఈవీఎంలలోనే ఓట్లు నిక్షిప్తమై ఉంటాయని వివరించారు.


