కాంగ్రెస్ పార్టీతోనే ఇంటింటికి సంక్షేమ పథకాలు..!
– పట్టణంలో ప్రారంభమైన వార్డు సభలలో పార్టీ నేతలు
– పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్, మార్కెట్ కమిటి చైర్మన్
– కౌన్సిలర్ల సమక్షంలో లబ్దిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీతోనే ఇంటింటికి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తాండూరు పార్టీ నాయకులు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాల కోసం అర్హులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన వార్డు సభలు పట్టణంలో అట్టహాసంగా ప్రారంభయ్యాయి. మంగళవారం తాండూరు పట్టణంలోని 1వ వార్డు నుంచి 8వ వార్డుతో పాటు 24, 25వ వార్డులలో వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. గత పదేండ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. అంతేకాకుండా పేదలకు ఇందిరమ్మ ఇండ్లతో పాటు స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని, ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించేందుకు వార్డు సభలు నిర్వహిస్తుందన్నారు. పథకాలకు దరఖాస్తు చేసుకోలేని వారితో పాటు అమలు కాక ఇబ్బందులు పడుతున్న లబ్దిదారులు కూడా వార్డు సభలలో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.
దరఖాస్తుల వెల్లువ
మరోవైపు మొదటి రోజు మంగళవారం నిర్వహించిన వార్డు సభలలో దరఖాస్తుల సందడి నెలకొంది. ఆయా వార్డుల కౌన్సిలర్ల సమక్షంలో లబ్దిదారులు కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర పథకాలకు దరఖాస్తులను సమర్పించుకున్నారు. దరఖాస్తుల దారులతో వార్డు సభలు సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లప్ప, సాహు శ్రీలత, ప్రభాకర్ గౌడ్, భీంసింగ్, బోయరవి, వెంకన్న గౌడ్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి. వార్డు ఆఫీసర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

