అయ్యప్ప సన్నిధిలో నిత్య అన్నదానం
– ఈనెల 27నుంచి ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో నిత్య అన్నదానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటి సంఘం తెలిపింది. ఆదివారం ఆలయ కమిటి సంఘం ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, కోశాధికారి మనోహర్ యాదవ్ల ఆధ్వర్యంలో దేవాలయ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహాకారంతో ఆలయాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రూ. 27 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అదేవిధంగా ఈనెల 27 నుంచి ఆలయంలో నిత్య అన్నదానం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బుధవారం తాండూరుకు చెందిన శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ సహాకారంతో అన్నదానం జరుగుతుందని, మిగతా వేళల్లో దాతల సహాకారంతో కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆలయ కమిటి ప్రతినిధులు బస్వరాజు, సంగమేష్, విష్ణువర్దన్, శ్రావణ్ గౌడ్, భద్రేశ్వర్, వేణుగోపాల్ రెడ్డి, కొంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

